మీ అందరి దయ వల్ల ఆ చరిత్ర తిరిగి రాయబోతున్నాం: నారా లోకేశ్
- 1985 తర్వాత టీడీపీ జెండా మంగళగిరిలో ఎగరలేదు
- మన గడ్డపై మళ్లీ టీడీపీ జెండా రెపరెపలాడుతుంది
- నన్ను ఆశీర్వదించండి.. దీవించండి
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న లోకేశ్ మాట్లాడుతూ, ‘నేను చాలా చిన్నోడిని. మీ మనవడి వయసు.. మీ కొడుకు వయసు నాది. కొంతమందికి వారి అన్న వయసు నాది. ఆశీర్వదించండి.. దీవించండి. ‘ఎందుకు నువ్వు మంగళగిరికి వెళుతున్నావు? కుప్పం నియోజకవర్గం ఉంది కదా’ అని చాలా మంది నాతో అన్నారు. 1985 తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఈ గడ్డపై ఎగరలేదు. ప్రజల దయ వల్ల, మీ అందరి దయ వల్ల ఆ చరిత్ర తిరిగి రాయబోతున్నాం. మన గడ్డపైన మళ్లీ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.